తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని టీటీడీ జేఈవో సదా భార్గవి కార్పొరేషన్ ఉద్యోగులను కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ టీటీడీలో ని వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వేతనం ఇతర సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
కార్పొరేషన్ ఉద్యోగులకు మేలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఆర్జిత సెలవులు వర్తింపచేశామని, ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించామని, గ్రాట్యూటీ చెల్లిస్తామని వెల్లడించారు. గుర్తింపు కార్డుతో సుపథం మార్గం ద్వారా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించామని అన్నారు. రూ.20 చొప్పున నెలకు 10 లడ్డూలు సబ్సిడీపై పొందే అవకాశం ఇచ్చామని ఆమె వివరించారు.
ఇటీవల వేతనాలు కూడా పెంచామన్నారు. నెలకు రూ.1000 అద్దెతో క్వార్టర్స్ కేటాయించామని, త్వరలో వీటికి మరమ్మతులు పూర్తి చేసి ఉద్యోగులకు అందిస్తామని ఆమె పేర్కొన్నారు. కార్పొరేషన్ సీఈవో శేష శైలేంద్ర మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం టీటీడీ యాజమాన్యం ఎంతో ఉన్నతంగా ఆలోచించి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. టీటీడీకి అవసరమైన అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఇకపై కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతినెలా ఒకటో తేదీలోపే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాల సొమ్ము జమ చేస్తున్నట్టు తెలిపారు.