అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ మలివిడతగా నిర్వహించ తలపెట్టిన మహాపాదయాత్రపై ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి నవంబర్ 11 వరకు రెండు నెలల పాటు 10 పార్లమెంట్ నియోజకవర్గాలు 40కి పైగా అసెంబ్లీ స్థానాల గుండా రైతులు మహా పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మహాపాదయాత్రపై స్పందించారు. ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికేంద్రకరణతోనే సాధ్యమవుతుందని అన్నారు. అయితే ఒక సామాజికవర్గానికే న్యాయం చేయడానికి చంద్రబాబు అమరావతి రైతుల ఆందోళనలను వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. మూడు ప్రాంతాల అభివృద్ది కోసం మూడు రాజధానులను నెలకొల్పేందుకు వైసీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. రాజధాని కోసం అమరావతి నుంచి అరసపల్లి వరకు నిర్వహిస్తున్న మహాపాదయాత్రపై స్పీకర్ విరుచుకుపడ్డారు.
ఉత్తరాంధ్రపై జరిగేది పాదయాత్రలేక దండయాత్రా అని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చెప్పే యాత్ర ఇదని, పాదయాత్ర చేసే రైతులను అడగాలని వెల్లడించారు. మూడు రాజధానులతో రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.