అమరావతి : పోలింగ్ రోజున ఈవీఎం(EVM) ధ్వంసం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (YCP MLA Pinnelli ) ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందారెడ్డి చేతిలో 32,324 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బ్రహ్మానందా రెడ్డికి 1,19,959 ఓట్లు రాగా పిన్నెల్లికి 88,608 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
పల్నాడు జిల్లా మాచర్ల (Macharla) నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన పిన్నెల్లి 2009 నుంచి ఒకసారి కాంగ్రెస్ నుంచి , మూడుసార్లు వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన పోలింగ్ రోజున నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను స్వయానా ధ్వంసం చేయడంతో పాటు మహిళా ఓటరును బెదిరించారు.
పోలింగ్ అనంతరం నియోజకవర్గంలో అతడి అనుచరులు టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించి పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ పొందారు. ఈ బెయిల్పై కూడా బాధితుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారం ఆయన కౌంటింగ్ కేంద్రాలకు వెల్లలేదు .