అమరావతి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతుంది. సుమారు ఎనిమిది రోజుల తర్వాత వరద తగ్గుతుండడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 21.5 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీ నుంచి 25.42 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. 11,500 క్యూసెక్కుల నీటిని అధికారులు పంట కాల్వలకు విడుదల చేస్తున్నారు.
దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతమైన కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానాం మునుపెన్నడూ లేని విధంగా ముంపు బారిన పడింది. భారీ వరదలతో గోదావరికి చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. బ్యారేజీ వద్దకు అత్యదికంగా క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండడంతో జారీ చేసిన మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
అటు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 3లక్షల 3వేల 779 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 859.60 అడుగుల వరకు నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత 104.64 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.