తిరుపతి : తిరుపతి(Tirupati) శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) భాగంగా నాలుగో రోజు గురువారం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవను వైభవంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
అర్చకులు మాట్లాడుతూ ‘ ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారని’ వెల్లడించారు. అనంతరం శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, కంకణబట్టార్ ఆనందకుమార్ దీక్షితులు, భక్తులు పాల్గొన్నారు.