తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవా(brahmotsavam)ల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం శ్రీ రామ చంద్రుడు శంకు, చక్రాలు, విల్లు ,బాణం, గద, ఖడ్గం పంచాయుధాలను ధరించి సూర్యప్రభ వాహనం(Suryaprabha)పై దర్శనమిచ్చారు. స్వామివారి వాహన సేవకు భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు. టీటీడీ అర్చకులు మాట్లాడుతూ సూర్యుడు తేజోనిధని అన్నారు. సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత అని తెలిపారు.
వర్షాల వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు వల్ల పెరిగే ఔషధాలు సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్ రమేశ్, భక్తులు పాల్గొన్నారు.