తిరుపతి : తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజు సోమవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్సేవ నిర్వహించారు.
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ చంగలరాయులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.