తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామిని దర్శించుకునేందుకు రెండు, మూడు గంటల సమయం పడుతుంది.
నిన్న తిరుమల శ్రీవారిని 88,924 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,282 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 26 న స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వారు చెప్పారు.
ప్రైవేటు సంస్థలకు విరాళాలివ్వొద్దు
తిరుమల శ్రీవారి అన్నదానం ప్రాజెక్టుకు నిత్యం పెద్ద మొత్తంలో విరాళాలు అందుతుంటాయి. అయితే, కొందరు ప్రైవేటు వ్యక్తులకు విరాళాలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. భక్తులు తమ విరాళాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వొద్దని సూచించింది. సికింద్రాబాద్లోని అనంత గోవిందదాస ట్రస్టుకు టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ పేరు చెప్పి విరాళాలు సేకరించే సంస్థలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని టీటీడీ హెచ్చరించింది.