అమరావతి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ (Tweet) చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. త్వరలో తదుపలి కార్యాచరణను ప్రకటిస్తానని పేర్కొన్నారు. డిసెంబర్ 28న తాడేపల్లి నివాసంలో ఏపీ సీఎం జగన్(CM Jagan) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న అంబటి పదిరోజుల్లోనే మనస్సు మార్చుకుని వైసీపీ(YCP) ని వీడుతున్నట్లు ప్రకటించడం సంచలనం కలిగిస్తుంది.
This is to inform everyone that I have decided to quit the YSRCP Party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time.
Thank You.
— ATR (@RayuduAmbati) January 6, 2024
ఇప్పటి వరకు జీవితంలో క్రికెట్ ప్రాధాన్యత ఉండగా ఇకపై రాజకీయాల్లో చురుకుగా ఉంటూ రెండో ఇన్నింగ్స్ (Second Innings) ప్రారంభిస్తానని వైసీపీలో చేరిన రోజున మీడియాకు వెల్లడించారు. తనకు మొదటి నుంచి వైఎస్ జగన్ అభిమానినని వివరించారు. ఏపీలో పారదర్శకంగా పాలనను అందిస్తున్న జగన్కు వెన్నంటూ ఉంటానని, ప్రజా సేవ చేసేందుకు తాను రాజకీయంలోకి అడుగు పెట్టానని తనకు అవకాశమిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంబటి రాయుడు పేర్కొన్నారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరిచిన ఆయన అందుకనుణుగంగా గుంటూరులో విస్తృతంగా పర్యటించారు. అయితే వైసీపీలో కొనసాగుతున్న రాజకీయ మార్పులు, చేర్పుల వల్ల గుంటూరు స్థానం తనకు కాకుండా మరొకరి వచ్చే అవకాశముండడంతో అంబటి వైసీపీని వీడుతున్నట్లు సమాచారం .