విజయవాడ : మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రంగులు మార్చే వ్యకి అని, పవన్ కల్యాణ్ ల్యాండ్మైన్ అంటూ వ్యాఖ్యానించారు. ఇన్నేండ్లయినా మనోళ్లు ఇంకా హైదరాబాద్నే రాష్ట్ర రాజధాని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై వ్యాఖ్యానిస్తూ.. స్వతంత్రంగా ఉండే వెంకయ్య నాయుడు నోరు నొక్కే పనిచేశారని ఎన్డీఏ కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదికపైకి నటుడు చిరంజీవిని ఆహ్వానించడం పెద్ద పొరపాటని సీపీఐ నారాయణ చెప్పారు. రాజకీయంలో రంగులు మార్చే చిరంజీవికి బదులుగా అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించిన నటశేఖర కృష్ణను వేదికపైకి పిలుస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక పవన్ కల్యాణ్ ఎప్పుడు, ఎవరిపై పేలుతాడో తెలియని ల్యాండ్మైన్లా తయారయ్యాడని అన్నారు. ఏపీలోని రోడ్ల దుస్థితిపై జనసేన చేపడుతున్న నిరసనలను స్వాగతిస్తున్నట్లు నారాయణ చెప్పారు.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసింది శూన్యమే అని, అలాంటప్పుడు ఎన్డీఏ బలపరిచిన వ్యక్తికి వైసీపీ, టీడీపీలు మద్దతు ఇవ్వడం అవసరమా? అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో మమత ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ నిలిపి.. స్వతంత్రంగా ఉండే వెంకయ్య నోరు నొక్కారని దునుమాడారు. రాష్ట్రం విడిపోయి ఇన్నేండ్లయినా ఇంకా హైదరాబాద్ నగరాన్నే రాజధానిగా భావిస్తున్నారని, రాజధానిని ఏర్పాటు చేయాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీలో కనిపించడం లేదన్నారు. ప్రస్తుత వరదలను నివారించడంలో, వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.