తిరుపతి జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన భవనాన్ని నగర పాలక సంస్థకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ నాయకులు ఆందోళకు దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మహిళలు చింపి తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ఆందోళనా కార్యక్రమానికి హాజరైన సీపీఐ జాతీయ నేత నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా ద్రోహిగా ఏపీ ముఖ్యమంత్రి ఉండటం విచారకరం అన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన ప్రసూతి దవాఖానను ఇప్పుడు ఆయన తనయుడు నగర పాలక సంస్థకు కేటాయించారన్నారు. మహిళల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన భవనం, మౌలిక సదుపాయాలను నగర పాలక సంస్థకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. వైద్య మంత్రి విడదల రజిని, తిరుపతి మేయర్ శిరీష కూడా మహిళా ద్రోహులే అని దుయ్యబట్టారు. ప్రసూతి ఆస్పత్రిని ఇక్కడి నుంచి తరలిస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.