శ్రీశైలం : శ్రీశైలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేయాలని ఈఓ కేఎస్ రామారావు అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వివిధశాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేవస్థానం సిబ్బంది సహా పాజిటివ్ వచ్చిన వారంతా వైద్యుల సలహాలు తప్పక పాటించేలా పర్యవేక్షించాలని చెప్పారు.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ సునీల్ దేవస్థానానికి అందించిన ప్రత్యేక చుక్కల మందును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఆయుర్వేద ఔషధాలు, రోగనిరోధక శక్తిని పెంచే లేహ్యాలను నిత్యం తీసుకోవాలని కోరారు.
టెలీకాన్ఫరెన్స్లో దేవస్థానం కీలక విభాగాధిపతులు, ఐటీడీఏ అధికారులు, వైద్య నిపుణుడు డాక్టర్ సోమశేఖర్, పర్యవేక్షకులు శ్రీహరి, శ్రీశైలప్రభ పంపాదకుడు అనిల్ కుమార్, నర్సింహారెడ్డిలు తదితరులు ఉన్నారు.
కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న భక్తులనే ఆలయ దర్శనానికి అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ముందస్తు పరీక్ష చేయించుకోకుండా వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానం క్యూలైన్ల వద్ద ప్రత్యేక పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
క్షేత్ర పరిధిలో వ్యాపార సముదాయాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల
వరకు మాత్రమే తెరచి ఉంచాలని తాసిల్దార్ రాజేందర్ సింగ్ సూచించారు. శ్రీశైలం పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి