తిరుమల : తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం నిర్వహిస్తారని తెలిపారు.
అనంతరం కానుకలను వేరుచేయడం, లెక్కించడం చేపడతారని వివరించారు. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 60,939 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోఆ 20,203 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.17 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం కలుగుతుందని వివరించారు.