అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న రాష్ట్రంలో 71 కేసులు నమోదవ్వగా.. ఇవాళ అంతకు రెట్టింపు కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దానిలో వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 11,571 శాంపిళ్లను పరీక్షించగా.. 141 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,729కి చేరింది.
కృష్ణా జిల్లాలో 41, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కేసులు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. కాగా, గత 24 గంటల్లో 450 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 23,17,953 కేసులు నమోదవ్వగా.. 23,01,210 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2014 యాక్టివ్ కేసులుండగా.. వారంతా వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.