విశాఖపట్నం : లగ్జరీ కార్డెలియా క్రూయిజ్ బుధవారం ఉదయం విశాఖపట్నం పోర్టుకు చేరుకున్నది. హిందూ మహాసముద్రం తీరం వెంబడి ప్రయాణించే ఈ క్రూయిజ్.. విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై మీదుగా ప్రయాణించి తిరిగి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ క్రూయిజ్లో ప్రయాణించి ఎన్నో మధురానుభూతులను మూటగట్టుకునేందుకు ఎందరో పర్యాటకప్రియులు ఎదురుచూస్తున్నారు. ఉదయాన్నే విశాఖ ఓడరేవుకు చేరుకోవడంతో దానిలో ప్రయాణించేందుకు చాలా మంది పర్యాటకులు ముందుకు వచ్చారు. చెన్నైకి టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
కార్డెలియా క్రూయిజ్ కంపెనీ నిర్వహించనున్న ఈ లగ్జరీ షిప్.. సముద్రంలో తేలియాడే స్టార్ హోటల్లా కనిపిస్తుంది. ఈ క్రూయిజ్ విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రయాణిస్తుంది. మూడు రాత్రులు – నాలుగు పగళ్ల టూర్ ప్యాకేజీని అందిస్తున్నది. ఈ నౌకలో ఒకేసారి 1500 మంది ప్రయాణించేందుకు వీలున్నది. విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రయాణించేందుకు ఈ షిప్కు 36 గంటల సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం పట్ల కార్డెలియా క్రూయిజ్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
కోర్డెలియా క్రూజ్ మొత్తం 11 అంతస్తులను కలిగి ఉన్నది. ఇందులో అనేక అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ప్యాసింజర్ లాంజ్ ఇంజిన్, కార్గో తర్వాత మూడో అంతస్తు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు వెళ్ళవచ్చు. 10వ అంతస్తులో పెద్ద టెర్రస్ వంటి డెక్ ఉంటుంది. దాని తర్వాత పదకొండో అంతస్తులో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా డెన్ ఏర్పాటు చేశారు. ఇది కోర్డెలియా కిడ్స్ అకాడమీ పిల్లల ఆటల కోసం ఒక పెద్ద క్యాంపస్, వ్యాయామశాల, స్విమ్మింగ్ పూల్, క్యాసినో, హాస్య ప్రదర్శనల కోసం ఆడిటోరియంలు, సినిమాల ప్రదర్శనల కోసం థియేటర్లు, 24-గంటల సూపర్ మార్కెట్ ఉన్నాయి.