తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో కొండపై ఉన్న 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 69,804 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,615 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చిందని వివరించారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము వైభవంగా జరిగింది. శ్రీమలయప్పస్వామి, శ్రీ కృష్ణస్వామి లు వేర్వేరుగా వాహనాలపై తిరుచ్చిగా రాగా వేదపండితుల ఆధ్వర్యంలో పార్వేట మండపములో పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి.