Tirupati | ఏపీ రాజధాని అంశంలో ఇప్పటికీ ప్రజలు అయోమయంలోనే ఉన్నారు. అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను కొనసాగిస్తామని అధికారిక వైసీపీ చెబుతూంటే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా తిరుపతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
70 ఏండ్ల క్రితం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తిరుపతిని రాజధాని చేయాలని ఎన్జీ రంగా ఆనాడే ప్రతిపాదించారని చింతామోహన్ గుర్తుచేశారు. కానీ అప్పట్లో కర్నూలును రాజధానిగా చేశారని అన్నారు. ఆ తర్వాత దాన్ని కూడా మార్చేశారని తెలిపారు. ఈ 70 ఏండ్లలో ఏపీ రాజధానిని ఐదు సార్లు మార్చేశారని అన్నారు. తిరుపతిలో అనేక మౌళిక వసతులు ఉన్నాయని.. దాన్నే రాజధానిగా ప్రకటిస్తే ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు.
తిరుపతిలో ఏర్పేడు నుంచి రాపూరు దాకా లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని.. ఇక్కడ అయితే రైతులకు పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే ఖండలేరు వల్ల నీటి కొదవ కూడా లేదని తెలిపారు. హైదరాబాద్ కంటే కూడా తిరుపతిలో మంచి వాతావరణం ఉందని.. ఏడు విశ్వవిద్యాలయాలు, ఏడు జాతీయ రహదారులతో అన్ని సదుపాయాలు ఉన్నాయని అన్నారు.
అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా తిరుపతిని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కోరామని చింతా మోహన్ తెలిపారు. తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మం గారు 300 ఏండ్ల క్రితమే చెప్పారని అన్నారు. బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయని.. ఇది కూడా జరుగుతుందని వ్యాఖ్యానించారు. తిరుపతిని ఏపీ రాజధాని చేయాలని చింతా మోహన్ కోరడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.