అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డితోపాటు ఆ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్పై పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకే పోలీసులు వారిపై కేసు నమోదు చేయడం గమనార్హం.
వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నారని గతంలో వివేకా దగ్గర పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నేతలకు సంబంధం ఉన్నట్లుగా వారి పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు, ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని నాడు తన పిటిషన్లో పేర్కొన్నారు.
అంతేగాక, సీబీఐ అధికారులు చెప్పినట్లుగా సాక్ష్యం చెప్పాలని వివేకానంద కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని కృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని అప్పట్లో జిల్లా ఎస్పీగా ఉన్న అన్బురాజన్ను కలిసి వినతిపత్రం అందచేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో తెలిపారు.
కృష్ణారెడ్డి పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టిన పులివెందుల కోర్టు.. పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్లపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ మేరకు ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీసులు కేసులు నమోదుచేశారు.