అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కొత్త పీఆర్సీ జీవోల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించాలని , తొలగించిన అలవెన్సులపై చర్చించి పరిష్కరించాలని కోరారు. ఎన్ఎంయూ, ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతృత్వంలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో డిపోల ఎదుట ధర్నాలను నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక అమలు చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. 113,114జీవోలను మార్చాలని కోరారు. గతంలో ఉన్న సౌకర్యాలను కొనసాగించాలని , అదనంగా ఇస్తామని 1.6 శాతం ఫిట్మెంట్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా శాఖలో బదిలీల ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. కార్మికులకు రావాల్సిన వేతనాలు తగ్గించడం అన్యాయమని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు, గేట్ సమావేశాలను నిర్వహించారు.