Ttd Staff | తిరుమల : తిరుమలకు వచ్చే భక్తుల నుంచి ఎవరైనా టీటీడీ సిబ్బంది(Ttd Staff )డబ్బులు డిమాండ్ చేస్తే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఈవో ధర్మారెడ్డి సూచించారు. డయల్ యువర్ ఈవో (Dial your EO ) కార్యక్రమంలో భాగంగా భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. తిరుమల కొండపై గదులు ఖాళీ చేసే సమయంలో అక్కడి సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా డబ్బులు ఎవరికీ ఇవ్వవద్దని ఈవో సూచించారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఎండ కారణంగా భక్తులకు కాళ్లు కాలకుండా వైట్ పెయింట్, మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతిరోజు జలప్రసాద కేంద్రాల్లో నీటిని పరీక్షించిన తరువాతే నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు.
గదుల కేటాయింపు కేంద్రాల వద్ద త్వరలో తక్కువ ధరకు టప్పర్ వేర్, రాగి బాటిళ్ళను అందుబాటులో ఉంచుతామని ఈవో వెల్లడించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రిలో నెల రోజుల్లోనే రెండు గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకురావాలని పిలుపు నిచ్చారు.
ఫిబ్రవరిలో 18.42లక్షల మంది దర్శనం
ఫిబ్రవరి నెలలో స్వామివారిని 18.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో తెలిపారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 114.29 కోట్లు వచ్చిందన్నారు. ఫిబ్రవరిలో 92.96 లక్షల లడ్డూలను విక్రయించామని, 34.06లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు. 7.21 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని ఆయన తెలిపారు.