అమరావతి : విజయవాడ సమీపoలోని తుమ్మల పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. తుమ్మలపాలెం క్రాస్ రోడ్డు వద్ద కారును తప్పించబోయిన లారీని వెనుక నుంచి వస్తున్న ఎంవీఆర్ కాలేజ్ బస్సు వేగంగా ఢీ కొట్టింది. దీంతో కాలేజ్ బస్సు డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తితో పాటు బస్సులో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులున్నారని పోలీసులు తెలిపారు. రహదారిపైనే సంఘటన చోటు చేసుకోవడంతో ఇరువైపులా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.