శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి చైత్రమాసంలో జరిగే సాత్వికబలి కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా కొబ్బరికాయలు సమర్పించారు. దేవస్థానం ఆనవాయితీ ప్రకారం.. మంగళవారం ఉదయం స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద విధులు నిర్వహించే వారు స్త్రీ వేషంలో అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం జరిగింది. మహా శివరాత్రి తర్వాత.. వచ్చే ప్రతి మంగళ, శుక్రవార రోజుల్లో కొబ్బరికాయలు రాశులుగా పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేకపూజలు నిర్వహించి అమ్మవారి సింహ మండపం వద్ద సమర్పించడంతో లోక కల్యాణం జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. ఏప్రిల్ 19వ తేదీన అమ్మవారికి సాత్వికబలి కుంభోత్సవం నిర్వహించనున్నట్లు ఈఓ లవన్న తెలిపారు. కార్యక్రమంలో ఈవోతో పాటు ఏఈవో హరిదాసు, సూపరింటెండెంట్ అయ్యన్న, మహేందర్రెడ్డి, ఆలయ ప్రధానార్చకులు సిబ్బంది పాల్గొన్నారు.