సోమవారం నాడు హఠాన్మరణం చెందిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి సీఎం జగన్ నివాళులు అర్పించారు. భార్య భారతితో కలిసి వచ్చిన జగన్.. గౌతమ్రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. మేకపాటి గౌతమ్రెడ్డి తల్లి, భార్యను ఓదార్చారు. అక్కడే కాసేపు కూర్చొని సంతాపం ప్రకటించారు. అంతకుముందు పలువురు నేతలు కూడా మేకపాటి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ మంత్రిగా గౌతమ్రెడ్డి ఉన్నారు. దుబాయ్ నుంచి ఆదివారమే తిరిగొచ్చిన ఆయన సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. గౌతమ్రెడ్డి మృతికి నివాళిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది.
బుధవారం నాడు నెల్లూరులోని బ్రాహ్మణపల్లిలో గౌతమ్రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.