నెల్లూరు పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. కొన్ని రోజులుగా మంత్రి కాకాణి,మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావించిన ముఖ్యమంత్రి జగన్…. వారిద్దర్నీ సీఎంవోకు పిలిపించారు. వారితో చర్చించారు. వారిద్దరికీ క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. సీనియర్లే ఇలా చేస్తే ఎలా? అంటూ సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బహిరంగంగా విమర్శలు చేసుకోవడం ఏంటని వారిద్దరిపై ఫైర్ అయ్యారు. కచ్చితంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, మీరిద్దరూ కలిసే పనిచేయాలని సీఎం జగన్ తేల్చి చెప్పారు.
ఇన్ని రోజుల పాటు ఇరువురు నేతలూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్న తర్వాత… మీడియాతో మంత్రి కాకాణి గోవర్ధన్ మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్కు, తనకు ఎలాంటి విభేదాలూ లేవని ప్రకటించారు. తామెక్కడా పోటాపోటీ సభలు నిర్వహించలేదని పేర్కొన్నారు. పోటా పోటీ సభలు కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. నిప్పు లేకుండానే ప్రస్తుత పరిస్థితుల్లో పొగ వస్తోందంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కూర్చున్న చెట్టునే నరుక్కునే మూర్ఖులం మాత్రం కామని తెలిపారు. తనకు, మాజీ మంత్రి అనిల్కు ఎలాంటి గ్యాప్ లేదని, ఫ్లెక్సీలు కూడా చింపుకోలేదని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. ఇరువురమూ కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కాకాణి వెల్లడించారు.