విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) ఆయా ప్రభుత్వాలను కోరింది. కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన పలు చట్టబద్ధమైన నిబంధనలను అమలు చేయకపోవడంపై విశాఖపట్నం జిల్లా సీఐటీయూ కమిటీ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖపట్నం లోక్సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణను కలిసి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
కనీస వేతనాలు, భద్రతా ప్రాధాన్యతలు, ఈఎస్ఐ చెల్లింపులు, సెలవులు, బోనస్ వంటి సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయని, విశాఖపట్నం పోర్టు అథారిటీలోని కాంట్రాక్టర్లు సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ కార్మికులకు అమలు చేస్తున్నప్పటికీ.. 9 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని సీఐటీయూ ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబంధించి ఎలాంటి జీవో లేకపోవడంతో సరైన వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు తప్పించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్పీసీఎల్, హిందుస్తాన్ షిప్యార్డ్ లిమిలెడ్లో కాంట్రాక్ట్ కార్మికులను దోచుకుంటున్నారని, వారిని నిబంధనలకు విరుద్ధంగా రోజులో 10 గంటలు పనిచేయిస్తున్నారని వారు ఆరోపించారు. అలాగే, బీహెచ్ఈఎల్లో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా కనీస వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. రైల్వే శాఖలో కూడా ఇదే ధోరణి కొనసాగుతున్నదని వారు విచారం వ్యక్తం చేశారు. వీటితో పాటు కార్మికుల భద్రత, సంరక్షణ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదన్నారు.