విజయవాడ: ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన నట్టి కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానంటున్నారాయన.
రాజకీయం ఆరంగేట్రంపై ఆయన చేసిన ప్రకటన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు స్పష్టం చేస్తున్నది. జగన్ ఆదేశిస్తే అంటూ స్వయంగా ఆయనే తన రాజకీయ ఆరంగేట్రంను వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎదుర్కోవడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, కొంతమంది అధికారులు చంద్రబాబుకు తొత్తులుగా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. సినీ ఫీల్డ్ లోని కొందరు.. అధికారులు, రాజకీయ నాయకులతో కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు.
ఇలాఉండగా, తన రాజకీయ రంగ ప్రవేశాన్ని కొడాలి నానిని అడ్డుకోవాలని చూస్తే ఆయన భయపడే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రజల మధ్యలో ఉంటానని తెలిపారు.