అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు సమాచార ఇచ్చారనే అభియోగాలపై అశోక్ బాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీటీవోగా పని చేసిన సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. సర్వీస్ రికార్డు లేకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదు చేశారు.
నకిలీ బీకాం విద్యార్హతల ధ్రువీకరణపత్రాలు ఇచ్చారని ఎమ్మెల్సీ అశోక్బాబుపై అభియోగాలు ఉన్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను తారుమారు చేయడమే కాకుండా ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హత వివరాలను నకిలీవిగా అందించారనే ఆరోపణలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. అశోక్ బాబుపై సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. అశోక్ బాబుపై 2021లో లోకాయుక్తలో కేసు నమోదు కాగా, ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.
అశోక్ బాబు గతంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. బీకాం చదవనప్పటికీ నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని అభియోగాలు వచ్చాయి. తాను బీకాం చదివినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎన్నికల అఫిడవిట్లో అశోక్బాబు పేర్కొన్నారు. ఒక కేసు పెండింగ్లో ఉండగా.. తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్లో అశోక్బాబు వెల్లడించారనే అభియోగాలు కూడా ఉన్నాయి.