అమరావతి : విశాఖలో రెండురోజుల పసికందును ఇద్దరు మహిళలు మాయం చేసిన సంఘటన కలకలం సృష్టించింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీలో నిందితులను పట్టుకుని చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పద్మనాభం మండలం రేవిడి రౌతులపాలెం గ్రామానికి చెందిన మజ్జి అప్పయ్యమ్మ ప్రసవం కోసం ఈనెల 11న విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో చేరింది. 13న సిజేరియన్ ద్వారా ఆమెకు పాపకు జన్మనిచ్చింది.
నిన్న రాత్రి ఇద్దరు మహిళలు వైద్యసిబ్బంది అంటూ అక్కడికి వచ్చి వైద్యం అందించాలని చిన్నారిని తీసుకెళ్లారు. తిరిగి ఎంతకూ వెనక్కి తీసుకురాకపోవడంతో అనుమానం వచ్చి డ్యూటీ వైద్యులకు సమాచారం అందజేశారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇందులో ఇద్దరు మహిళలు పసికందును తీసుకెళ్తున్నట్లు గమనించి కేసు నమోదు చేశారు. కాగా పసికందు అపహరణ విషయాన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు పలు మార్గాల్లో తనిఖీలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ జంక్షన్ వద్ద తనిఖీ చేస్తుండగా కారులో అనుమానంగా ఉన్న ఇద్దరు మహిళలను విచారించగా వారి వద్ద పసికందు లభ్యమైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేశ్వరి, లక్ష్మిప్రసన్న అనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పసికందును ఇవాళ సాయంత్రం వరకు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.