శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్పై చీటింగ్ కేసు నమోదైంది. ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూలు చేసి ముఖం చాటేయడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా కరీముల్లా షేక్ అమీన్ ఉన్నారు. ప్రభుత్వంలో తనకు ఎంతో పలుకుబడి ఉన్నదంటూ నిరుద్యోగులను నమ్మబలికాడు. ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురి వద్ద కరీముల్లా షేక్ అమీన్ లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. ఎప్పుడు ఉద్యోగం గురించి ఆరా తీసినా ఏదో ఒక కారణం చెప్తూ దాటవేస్తున్నాడు. దాంతో కరీముల్లా షేక్ అమీన్ చేతిలో మోసపోయామని గ్రహించిన నల్లచెరువుకు చెందిన అబ్దుల్ హుస్సేన్ ఖాన్.. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకొని తనను చీట్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీముల్లా షేక్ అమీన్పై పోలీసులు ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాను చైర్మన్గా ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన నుంచి కరీముల్లా రూ.3.80 లక్షలు తీసుకున్నాడని బాధితుడు అబ్దుల్ హుస్సేన్ ఖాన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. గత ఏడాది డిసెంబరు 31న కరీముల్లా షేక్ అమీన్కు చెందిన బ్యాంకు అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నాడు. కనీసం ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగమైనా ఇప్పిస్తాడేమో అంటూ ఆయన చుట్టూ ఆరె నెలలుగా తిరుగుతున్నా ఫలితం లేదని తన ఫిర్యాదులో తెలిపాడు. కరీముల్లా షేక్ అమీన్ తనకు ఉద్యోగం చూపకపోగా పైగా బెదిరింపులకు దిగుతున్నాడని అబ్దుల్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.