అమరావతి : ప్రభుత్వం చేపడుతున్న నూతన విధానాలు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడానికి కాదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ను మెరుగుపరిచేందుకు మాత్రమే మార్పులు తీసుకువస్తున్నామని వెల్లడించారు. గురుపూజోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో సీఎం పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులకు శుభాకాంక్షలు తెలిపారు.
తల్లిదండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువులని అన్నారు. జ్ఞానం పంచి నడత నేర్పించే గురువులందరికీ శుభాకాంక్షలని తెలిపారు. జన్మనించిన తండ్రికి, ఈ జన్మకు సార్థకతను చేస్తూ మెరుగైన జీవితాన్ని నేర్పినందుకు గురువుకు రుణపడి ఉంటానని అన్నారు. మంచి బోధనతో సమాజాన్ని మార్చే శక్తి గురువులకు ఉందని పేర్కొన్నారు. విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు మూడేండ్లలో అనేక గొప్ప కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తాను విద్యా సమీక్షకు అధిక ప్రాధాన్యత ఇచ్చానని వెల్లడించారు.
విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని నేర్పాలని సూచించారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను కార్పొరేట్ రంగానికి అమ్మెసీ పేదవర్గాలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి, నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన మార్పులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 176 మంది టీచర్లు , అధ్యాపకులను జగన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.