Chevireddy Bhaskar Reddy | తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేసిన ఆరోపణలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి డ్రామాల వల్లనే నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని తెలిపారు. దాడులు, కొట్లాటలకు దిగాలనే ఆలోచన కూడా తమకు లేదని స్పష్టంచేశారు.
ఏపీలో ఎన్నికల రోజున, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల తెల్లారి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. దీంతో దాడికి బాధ్యులుగా భావిస్తున్న పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ తిరుపతి ఎస్పీ ఆఫీసుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్లారు. దాడి ఘటనలో సంబంధం లేని వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఎస్పీ హర్షవర్దన్ రాజుకు వివరించారు. దాడి ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ను ఎస్పీకి అందజేశారు. ఆ వీడియోను పరిశీలించి.. దాడికి సంబంధం లేని వ్యక్తులను విడుదల చేయాలని కోరారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
నామినేషన్ రోజు నా కొడుకుపై దాడి చేసినా మేం తిరిగి దాడి చేయలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. అవమానాన్ని భరించామే తప్ప ప్రతీకారానికి పోలేదని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేసినా తాను ఎలాంటి కామెంట్ చేయలేదని చెప్పారు. పులివర్తి డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. దాడులు, కొట్లాటలకు దిగాలనే ఆలోచన కూడా మాకు లేదని.. ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు.
కూచివారిపల్లిలో చిన్ని గొడవను పట్టుకుని విపక్షాలు రాద్దాంతం చేశాయని చెవిరెడ్డి తెలిపారు. ఇల్లు కాల్చారు.. రెండు కార్లు ధ్వంసం చేశారని చెప్పారు. మూత్రం పోసి ఒక అబ్బాయిని దారుణంగా కొట్టారని అన్నారు. మోహిత్ పీఆర్వో ఈశ్వరరెడ్డిని 15 నిమిషాల పాటు చెప్పుతో కొట్టారు. ఇన్ని జరిగినా నేను కేసులు పెట్టలేదు. అవమానం భరించానని తెలిపారు. యూనివర్సిటీ దగ్గర నాని కారుపై మాత్రమే దాడి చేశారని.. అది కూడా తప్పేనని చెప్పారు. కారుపై దాడి తర్వాత నాని యాక్టివ్గా నడుచుకుంటూ వెళ్లారని.. రెండు గంటల తర్వాత వీల్ ఛైర్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇదంతా డ్రామా అని విమర్శించారు. రాజకీయం జీవితంలో ఒక భాగమే తప్ప జీవితమే రాజకీయం కాదని స్పష్టం చేశారు.