అమరావతి : టీడీపీ నాయకులకు ప్రతీది రాజకీయం చేయడం అలవాటుగా మారిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. గోదావరి వరద ప్రభావాన్ని కూడా వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారని ఆరోపించారు . ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
గోదావరికి 36 సంవత్సరాల తరువాత జులై నెలలో వరదలు రావడం ఇదే ప్రథమమని అన్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ప్రాణ నష్టం జరుగలేదని తెలిపారు. వరద బాధితులను పునరావస కేంద్రాలకు పంపించిన ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను అందిస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పై మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు.
కాపర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.