Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేడని.. ఆయన ఓ రాజకీయ వికలాంగుడు అని విమర్శించారు. కర్నూలు జిల్లాలో బుధవారం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పొత్తులు లేకపోతే చంద్రబాబు నిలబడలేడని.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం ఆయనది అని ఎద్దేవా చేశారు.
టీడీపీకి బీజేపీ, జనసేన ఊతకర్రలుగా మారాయిన మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. ఈ మూడు పార్టీల పొత్తును తాము ముందే ఊహించామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేసి.. గతంలో కంటే భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక మూడు రాజధానులకు జగన్ కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా, మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పెద్దిరోడ్డు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాఫియాతో పొత్తు లేకపోతే పెద్దిరెడ్డి నిలబడగలడా అని ప్రశ్నించారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు.