అమరావతి : ఏపీలో మంత్రి కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని , అటువంటి పార్టీ, అధినేతపై గౌరవం లేకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకుడు బుద్ద వెంకన్న ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు కొడాలి నానికి టికెట్ ఇచ్చి చంద్రబాబు తప్పు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడితే మేం పదిరెట్లు స్పందిస్తామని వెల్లడించారు.
జోగి రమేశ్లా చంద్రబాబు ఇంటివైపు ఎవరైనా వస్తే చావకొట్టి పంపుతామని పేర్కొన్నారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రా తేల్చుకుందామని సవాలు విసిరారు. కొడాలి నాని నీ భాష ఏంటి.. నీ చరిత్ర ఏంటి ప్రజలందరికీ తెలుసని అన్నారు. రాష్ట్రంలో అనేక వైసీపీ నాయకుల దౌర్జాన్యాలు కొనసాగుతున్నా డీజీపీ ప్రవర్తన తీరు డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీలా ఉందని విమర్శించారు. షర్మీల ఏపీలో పార్టీ పెడితే చేరే వ్యక్తిలో మొదటి వ్యక్తి కొడాలి నాని ఉంటారని పేర్కొన్నారు. క్యాసినోవా వ్యవహారంలో రూ. 250 కోట్లు చేతులు మారాయని బుద్ద వెంకన్న విమర్శించారు.
అప్పట్లో గుడివాడలో కొడాలి నాని ఆయిల్ దొంగతనాలు చేసేవాడని అతడిపై అప్పటి పోలీసు అధికారి వర్ల రామయ్య చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.