అమరావతి : ఏపీలో రాజకీయ విమర్శలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సంచలన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి టీడీపీ నేత చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. ఏపీలో పలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని మానవతప్పిదం వల్ల వాటిల్లిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రవర్తన చూస్తే అధికార దాహంతో పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని, అతడిని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేరవలసిన పరిస్థితి వస్తుందేమోనని అన్నారు .
వరద బాధితులను పలకరించేందుకు వచ్చిన సీఎం జగన్ను బాధితులు అప్యాయంగా పలకరించడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డిని గాని, వైఎస్ జగన్ను చూస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని, వారు ఎలాంటి కల్మశం లేకుండా ప్రజలకు అంకితమై సేవలందిస్తున్నారు కాబట్టే వారిని ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో ఉండే చంద్రబాబును ఛీదరించుకుంటున్నారని ఆరోపించారు.