అమరావతి : ఏపీలో జరుగబోయే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్ తదితరులు శంకరగిరి మాణ్యాలకు పోవాల్సిందేనని ఏపీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో సింగిల్గా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేక జనసేనతో కలిసి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో గెలుస్తానని నమ్మకం లేక పవన్ కల్యాణ్ను వెంట పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు.
రెండు పార్టీలను చిత్తూగా ఓడించాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని , 175 సీట్లు గెలుపొందాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. సొంత నియోజకవర్గంలో కాకుండా పక్కనున్న నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు, లోకేశ్ను ఆయన ప్రశ్నించారు.
వైఎస్ జగన్ పాలనను చూసి ఏపీలో అధికారంలోకి రామని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. లోకేశ్ చేపట్టిన యువగళం అట్టర్ ప్లాప్ అయ్యిందని వెల్లడించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తగిన గుర్తింపునిచ్చారని తెలిపారు.