అమరావతి : సీపీఎస్ విధానాన్ని ఎత్తివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెల 1 వ తేదీకి బదులుగా 11 న నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) తెలిపింది. ప్రభుత్వం అణచివేతకు గురిచేస్తూ ఇబ్బందులు పెట్టడాన్ని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు తిరుపతిలో పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీపీఎస్ విధానాన్ని మార్చకుండా తాత్సారం చేయడాన్ని నిరసిస్తూ వచ్చే నెల 1 న సీఎం నివాసాన్ని ముట్టడించాలని కూడా ఏపీ సీపీఎస్ఈఏ నిర్ణయించింది. దాంతో విజయవాడలో కఠిన నిబంధనలను పోలీసులు అమలుపరుస్తున్నారు. ఉద్యోగులు ఎవరు ఆందోళన చేస్తూ కనిపించినా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ ఇప్పటికే హెచ్చరించారు. పలువురు ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నేతలను అదుపులోకి తీసుకుని 143,342,427,452, R/W 120, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఉద్యోగులు కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారని ఏపీసీపీఎస్ఈఏ విచారం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 1 న చలో విజయవాడ పేరిట నిర్వహించనున్న సభ, ర్యాలీకి పోలీసుల అనుమతి కోరినా ఎలాంటి నిర్ణయం వెల్లడించకుండా సీపీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఇబ్బందులు సృష్టిస్తున్నదని సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. నోటీసులు జారీ చేస్తూ బైండింగ్ చేయడం వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో చలో విజయవాడను సెప్టెంబర్ 11 కి వాయిదా వేస్తున్నట్లు సంఘం నేతలు ప్రకటించారు.