అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ రోడ్డు, ఎమ్మార్ పల్లి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రోడ్డు, గొల్లవాని గంట, కృష్ణారెడ్డి నగర్, పూలవాణి గుంట, కొరమేను గుంటలో ముంపునకు గురైన గృహాలు, రోడ్లను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు.
అనంతరం బాధితులతో మాట్లాడి జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర రెడ్డి, జిల్లా పాలనాధికారి హరి నారాయణన్, నగరపాలక కమిషనర్ గిరీష.. ముంపు ప్రభావిత ప్రాంతాలను తెలియజేసేలా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వివరించారు.