ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. ఎజెండాలో తొలుత పెట్టిన ఓ అంశం తొలగించడంతో ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఉన్నపళంగా ఎజెండా మారడంతో జగన్ ప్రభుత్వం పెద్దలు ఏం చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ.. ఆ మేరకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ నెల 17 న సమావేశం ఏర్పాటుచేసి విభజన సమస్యలపై చర్చించేందుకు ఎజెండా ఖరారు చేసింది. అయితే, ఎజెండాలో తొలుత చేర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం విరమించుకున్నది. ఈ మేరకు అధికారులకు సమాచారం అందింది. మొత్తం 9 అంశాలకు గాను ఇప్పుడు చర్చలను 5 అంశాలకే పరిమితం చేసినట్లు సమాచారం.
కేంద్ర హోంశాఖ నియమించిన త్రిసభ్య కమిటీకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హోంశాఖ తన నోటిఫికేషన్లో పేర్కొన్నది. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పటివరకు కేంద్రంకు తెలంగాణ పెద్దలు విన్నవిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చిస్తే తలనొప్పులు వస్తాయని కాబోలు కేంద్రం తాజాగా ఎజెండాలోని ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని వెనక్కి తీసుకున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.