అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానితులందరినీ ఒక్కొక్కరిగా విచారిస్తున్నది. ఇవాళ కడప కేంద్ర కారాగారంలో ఉదయం నుంచి ఏడుగురు అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. 8 గంటలుగా విచారణ కొనసాగుతున్నది. కాసేపటి క్రితమే వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి సైతం విచారణకు హాజరైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిన్న పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు పలువురిని విచారించారు.
వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరితోపాటు అతడి భార్యను ప్రశ్నించారు. పులివెందుల కోర్టుకు సైతం అధికారులు మరోమారు వెళ్లివచ్చారు. ఈ కేసులో ఇటీవల వివేకానంద రెడ్డి వాచ్మెన్ రంగయ్య విచారించిన సీబీఐ అతడిని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసింది. హత్యలో సుమారు 9 మంది పాలుపంచుకున్నారని, సుపారీ ముఠానే వివేకాను హత్య చేసిందని రంగయ్య సంచలన విషయాలు వెల్లడించారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలన్నీ సీబీఐ సేకరించడంతో త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.