విజయవాడ: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఈ కేసు దర్యాప్తును చురుగ్గా చేపడుతున్న సీబీఐ.. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యలతో కూడా పోస్టులు పెట్టిన కేసులో తాజాగా మరో ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం జడ్డీలను దూషించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన కేసులో న్యాయవాది చంద్రశేఖర్, గోపాలకృష్ణతో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఒకరు సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి కాగా, ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సెల్గా వ్యవహరిస్తున్న మెట్ట చంద్రశేఖర్రావు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుంట రమేష్కుమార్ ఉన్నారు. జడ్జీలపై దూషణలు చేసిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈ నెల పదో తేదీన వీరికి సీబీఐ అధికారులు ఇచ్చింది. దీంతో ముగ్గురూ హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో వీరిని దాదాపు ఆరు గంటల పాటు అధికారులు విచారించారు.
అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి గుంటూరుకు తరలించారు. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పొన్నూరులోని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎదుట పోలీసులు హజరుపరిచారు. ఈ ముగ్గుర్నీ మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ డీఎస్పీ బీపీ రాజు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాఉండగా, రెండేండ్ల క్రితం కేసు విచారణ సందర్భంగా మెట్ట చంద్రశేఖర్, గోపాలకృష్ణ కళానిధి హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు కోరుతూ ఆఫిడవిట్ దాఖలు చేశారు. భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయమని అఫిడవిట్లో హామీ ఇచ్చారు.