అమరావతి: బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పలు షరతులు విధించడంతో భూముల విక్రయం చేపట్టి అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ నిర్ణయానికి వచ్చింది. ఏడాదికి 50 ఎకరాల చొప్పున మొత్తం 600 ఎకరాలను విక్రయించాలన్నది సీఆర్డీఏ ప్రతిపాదనలు రూపొందించింది. తొలివిడతలో 248.34 ఎకరాలను సీఆర్డీఏ విక్రయించనున్నది. ఈ మేరకు 389 నంబర్ జీఓను ప్రభుత్వం విడుదల చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు రాజధానిలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నది. దీని కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం. రాష్ట్రాన్ని నిధుల కొరత గత కొంత కాలంగా పట్టిపీడిస్తుండగా.. ఈ పనులు చేపట్టాలంటే పెద్ద మొత్తంలో నిధులు కావాల్సి ఉన్నది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సి రావడంతో భూముల విక్రయానికి సీఆర్డీఏ సిద్ధమైనట్లుగా చెప్తున్నారు. ఒక్కొక్క ఎకరం రూ.10 కోట్లకు విక్రయించి.. వచ్చే రూ. 2,480 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది. కాగా, భూములు విక్రయించగా వచ్చిన డబ్బుతో కేవలం రాజధాని అభివృద్ధి పనులు మాత్రమే చేపట్టాలని, ఇతర అవసరాలను వాడొద్దని హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్ కచ్చితంగా పాటించాలని పేర్కొన్నది.
బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో సొంతంగా నిధులను సమీకరించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. భూములను అమ్మడం ద్వారా నిధులను రాబట్టి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం విడుదల చేసిన 389 జీఓలో గతంలో బీఆర్ శెట్టి మెడిసిటీకి కేటాయించిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకిచ్చిన 148 ఎకరాలను సీఆర్డీఏ విక్రయించాలని నిర్ణయించింది. ఇలాఉండగా, మంగళగిరి సమీపంలోని అభివృద్ధి చేసిన లేఅవుట్లను అమ్మకానికి పెట్టి విక్రయాలు జరుగక సీఆర్డీఏ భంగపడింది. ప్రస్తుతం ఎకరా భూమిని రూ.10 కోట్లకు అమ్మేందుకు సీఆర్డీఏ ప్రపోజల్స్ సిద్ధం చేయడంతో.. వీటిని కొనేందుకు ఎవరు ముందుకొస్తారనే ప్రశ్న తెరపైకి వచ్చింది.