అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, జిల్లేరు వాగులో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్ బోల్తా పడి 9మంది దుర్మరణం పాలైన సంఘటనను మరచిపోకముందే మరో రెండు సంఘటనలు జరగడం ప్రయాణికులను కలవరపాటుకు గురిచేస్తుంది. ఒకేరోజు కొన్ని గంటల సమయంలోనే పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండలో , గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరిగాయి. అయితే ఈ రెండు సంఘటనలోనూ ప్రాణ నష్టం జరుగకపోవడం ప్రయాణికులు అదృష్టంగా భావిస్తున్నారు.
ఆచంట నియోజకవర్గం పెనుగొండ వద్ద కమలాపురం నుంచి నరసాపురం వస్తున్న ఆర్టీసీ బస్సు పెనుగొండ- మార్టేరు మధ్యలో రోడ్డు మరమ్మతు కారణంగా బస్సు కట్టలు, పింకు పిన్ విరిగిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు కాలువ అంచు వరకు వెళ్లి నిలిచిపోవడంతో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా గుంటూరు జిల్లాలో కాకుమాను నుంచి బాపట్లకు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అప్పాపురం సమీపంలో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. రహదారిపై ఉన్న గుంతను తప్పించే సమయంలో బస్సు కమాన్కట్ట విరగడంతో కాల్వలోకి దూసుకెళ్లగా ఐదుగురు ప్రయాణికులు, విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.