అమరావతి : పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా నేటి నుంచి ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనను నిర్వహించారు. ఫిట్మెంట్ పెంపు లేకుండానే ఒప్పందం ఎలా చేసుకున్నారని ఆరోపిస్తూ రాష్ట్రంలోని 12 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఫ్యాప్టో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. పలు జిల్లాలో ఒప్పంద పత్రాలను దహనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రుల కమిటీతో చేసుకున్న ఒప్పందం వల్ల హెచ్ఆర్ఏ శ్లాబులతో గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సాధన సమితి నాయకులు లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ , కార్మిక, పింఛన్దారులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. సమ్మె విరమణ సరైన నిర్ణయం కాదని, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా మంత్రుల కమిటీతో ఒప్పందాలున్నాయని ఫ్యాప్టో నాయకులు ఆరోపించారు.