విజయవాడ: వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, కొడాలి నానిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ 420 అనే పార్టీలో 840 లని విరుచుకుపడ్డారు. ఎన్నో భూ కబ్జాలు చేసిన వైసీపీ నేతలు.. విశాఖలో వృద్ధాశ్రమానికి చెందిన భూముల్ని సైతం వదలట్లేదని విమర్శించారు. అక్కడి భూ బాధితుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసి వివరాలు సేకరించి పోరాటం చేస్తామన్నారు.
వైసీపీ పార్టీ ముందే 420 కాగా.. ఆ పార్టీలోని విజయసాయిరెడ్డి, కొడాలి నాని 840 అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. విశాఖలో వైసీపీ నేతల ఆగడాలు శృతిమించిపోతున్నాయన్నారు. అన్ని నగరాల్లో భూకబ్జాలకు పాల్పడుతున్న 420 పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు. విశాఖపట్నంలో గంటలో ఘోరం, అర్ధగంటకో భూకబ్జాకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎందరో బాధితులు వీరిని ప్రశ్నించలేక నోరు మెదపక ఉంటున్నారని చెప్పారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు పార్టీ తరపుణ కాల్ సెంటర్ ఏర్పాటుచేస్తామన్నారు. త్వరలో విశాఖలో పర్యటించి హయగ్రీవ వృద్ధాశ్రమ భూముల్ని పరిశీలిస్తామని వెంకన్న చెప్పారు.
తాడేపల్లిలో జగన్ బటన్ నొక్కుతుండగా.. మరోవైపు వైసీపీ నేతలు కెమెరాల ముందు బట్టలు విప్పుతున్నారని బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. ఇలాంటి నాయకుడ్ని ఇంకా పార్టీలో పెట్టుకుంటున్నారు ఎందుకో ప్రజలకు చెప్పాలన్నారు. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై వైసీపీ మహిళా నేతలు నోరు విప్పాలని, తమకు ఎంత మేర అవమానం జరుగుతుందో పార్టీ అధినేతకు చెప్పే ధైర్యం చేయాలని సూచించారు.