అమరావతి : భుక్తి కోసం పరాయి భాషలు నేర్చుకోవచ్చు.. కానీ వ్యక్తిత్వాన్ని సంతరింపజేసిది మాత్రం మాతృభాషేనన్న విషయం మరువకూడదని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ గురువారం కంచిలో స్వామిజీని కలిశారు. తెలుగు భాషా సంస్కృతుల వికాపంపై చర్చించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ.. దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు నేర్పడానికి ఒక అంతర్జాతీయ సంస్ద అవసరమన్నారు.
తమిళనాడులోని కోటి మందికి పైగా ఉన్న తెలుగు వారికి సులభ తెలుగు పేరిట తెలుగు నేర్పే కార్యక్రమం చేపట్టి, తెలుగు ప్రాంతాలతో సంబంధ, బాంధవ్యాలు కలిపే ప్రయత్నం చేస్తున్నామని స్వామీజీ తెలిపారు. తిరువాయూరులో త్యాగరాజు ఆరాధనోత్సవాలు వలె తాళ్లపాకలో అన్నమయ్య సంకీర్తనోత్సవాలు నిర్వహించే యోచన చేస్తున్నట్లు చెప్పారు.
ఇటీవల ఖండకావ్య పోటీలు నిర్వహిస్త్ 125 కావ్యాలు పోటీకి వచ్చాయని తెలిపిన బుద్ధ ప్రసాద్ వ్యాఖ్యలపై స్వామివారు సంతోషం వ్యక్తం చేశారు. కంచి పీఠం పిల్లలకు పద్యాల పోటీలు నిర్వహిస్తుందని, నీతి, భక్తి శతక పద్యాలు, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడతాయన్నారు. పద్యం తెలుగువారి ఆస్తి అన్నారు. తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి మీరు చేస్తున్న సేవ గమనిస్తున్నామని తెలుపుతూ స్వామివారు బుద్దప్రసాద్కి ఆశీస్సులు అందించారు.