తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19న బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ఈనెల 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వివరించారు. ఈ కారణంగా డిసెంబరు 18న సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు. నిన్న 71,037 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 25,635 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.89 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.