తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని గరుడ వాహన సేవలో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన పంచమితీర్థాన్ని ఈనెల 28న వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందన్నారు.
కరోనా తరువాత తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాలలో పంచమితీర్థంకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తుల భద్రత కోసం 2500 మంది పోలీసు బలగాలతో పాటు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు.