తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజైన ఆదివారం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. అనంతరం స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో ఆదివారం చిన్నశేష వాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా కర్పూర హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఈ ఊరేగింపులో ఆకట్టుకున్నాయి.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనంపై విహరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, కంకణ భట్టార్ బాలాజీ రంగాచార్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.