తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శనివారం అమ్మవారు బద్రి నారాయణుడి అలంకారంలో పెద్దశేషవాహనంపై భక్తులకు దర్మనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ కొనసాగింది. శనివారం ఉదయం పెద్దశేష వాహనసేవలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి . టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 13 కళాబృందాలు, 320 మంది కళాకారులు పాల్గొని సంగీత, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
హైదరాబాద్ వీఎన్ఆర్ఎస్ నాట్యాలయానికి చెందిన 20 మంది కళాకారుల బృందం ప్రదర్శించిన అన్నమయ్య సంకీర్తనలకు భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కేరళ రాష్ట్రం పలక్కడ్ కు చెందిన 16 మంది మహిళల బృందం చండి మేళం ప్రదర్శనను నిర్వహించారు. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి,చిన్నజీయర్స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎం.ఎల్.ఎ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.